Tesla EV: భారతదేశంలో టెస్లా కార్ల తయారీకి ముహూర్తం ఖరారు.. ఆ రాష్ట్రంలోనే ప్లాంట్ నిర్మాణం..
ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతుంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో ముందు వరుసలో ఉన్న భారతదేశంలో కూడా ఈవీ వాహనాలకు డిమాండ్ అమాంతం పెరిగింది.
ముఖ్యంగా ఈవీ వాహనాల్లో ద్విచక్ర వాహనాలు కొనుగోళ్ల విషయంలో ముందు ఉన్నాయి. అయితే క్రమేపి ఈవీ కార్లపై కూడా ప్రజల్లో మక్కువ పెరుగుతుంది. మైలేజ్కు సంబంధిత సమస్యలతో పాటు పరిధికి సంబంధించిన సమస్యకు కూడా ఈవీ కంపెనీలు చెక్ పెట్టడంతో ప్రజలు ఈవీ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అనూహ్యంగా పెరిగిన డిమాండ్ నేపథ్యంలో ఈవీ కంపెనీలు తమ కార్ల ఉత్పత్తిని భారతదేశంలో కూడా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. అమెరికన్ ఈవీ మేకర్ టెస్లా తయారీ యూనిట్ గురించి నూతన ఏడాదిలో మనకు గుడ్ న్యూస్ అందించింది. ఈ కంపెనీ జనవరి 2024లో జరగబోయే వైబ్రాంట్ గుజరాత్ సమ్మిట్ సందర్భంగా గుజరాత్లో కార్ల తయారీ పరిశ్రమను ప్రకటిస్తుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అంతేకాకుండా ఈ ప్రకటన స్వయంగా టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ చేస్తారని తెలుస్తుంది. భారతదేశంలో టెస్లా ఈవీ యూనిట్ గురించి వివరాలను తెలుసుకుందాం.
గుజరాత్ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న ఎగుమతి అవస్థాపన, వ్యాపార అనుకూల విధానాలను కలిగి ఉంది. ఈ రాష్ట్రం టెస్లా గ్లోబల్ ఆశయాలకు అనుగుణంగా ఉందని ఆ కంపెనీ పేర్కొంటుంది. ఓ నివేదిక ప్రకారం టెస్లా కంపెనీ గుజరాత్లో 2 బిలియన్ల పెట్టుబడి పెడుతుందని వెల్లడించింది. అయితే భారతదేశంలో అధిక దిగుమతి సుంకాల కారణంగా ప్రస్తుతం టెస్లా కార్ల దిగుమతికి దూరంగా ఉంది. అలాగే భారతదేశంలో ఈవీ యూనిట్ను నెలకొల్పడం ద్వారా ప్రారంభ రెండేళ్లకు 15 శాతం దిగుమతి సుంకం రాయితీను ఈ కంపెనీ పొందనుంది. అలాగే భారత ప్రభుత్వం స్థానిక ఆటో విడిభాగాల పరిశ్రమను పునరుద్ధరించడానికి టెస్లాకు సంబంధించిన సామర్థ్యాన్ని అంగీకరిస్తూనే డ్యూటీ రాయితీని మంజూరు చేస్తామని చెబుతుంది. అయితే ప్రభుత్వం రాయితీ రేటుతో తక్కువ దిగుమతి పరిమాణాన్ని ప్రతిపాదించడంతో చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి.
సహాయక విధానాలు, టెస్లాను స్వాగతించే అంశంలో గుజరాత్ అధికారులు ఈ భాగస్వామ్యంపై నమ్మకంతో ఉన్నారని నివేదికలు సూచిస్తున్నాయి. టెస్లా కంపెనీ క్రమంగా ఉత్పత్తిని స్థానికీకరించడానికి సుముఖత వ్యక్తం చేయడం ద్వారా భారతీయ మార్కెట్పై తన నిబద్ధతను ప్రదర్శించింది మొదటి రెండేళ్లలో 20 శాతంతో ప్రారంభించి, నాలుగో సంవత్సరం నాటికి క్రమంగా 40 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ఉంది. ప్రభుత్వం, టెస్లా పరస్పర అంగీకారయోగ్యమైన విధి నిర్మాణాన్ని చేరుకుంటే మోడల్ 3, మోడల్ వై వంటి ప్రసిద్ధ టెస్లా మోడళ్ల భారతదేశంలో తయారు కానున్నాయి. అలాగే ఆయా కార్లు తక్కువ ధరకే వినియోగదారులకు చేరునున్నాయి. అంతే కాకుండా భారతదేశానికి అనువైన కొత్త మోడల్స్ను కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా నెక్సాన్ ఈవీ ధరతో సమానమైన ఎంట్రీ-లెవల్ టెస్లాను లాంచ్ చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే భారతదేశంలో టెస్లా ఎంట్రీకు సంబంధించిన వివరాలు తెలియాలంటే మాత్రం వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ జరిగే వరకూ వేచి చూడాల్సిందే.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
0 Comments